Wednesday, April 17, 2024

World Heritage Day

World Heritage Day వారసత్వ సంపదను కాపాడు కుందాం తమ దేశానికి చెందిన వెలకట్టలేని వారసత్వ సంపద పరిరక్షణకోసం కట్టుబడి ఉండటంతో పాటు యునెస్కోలో భాగమైన ప్రపంచంలోని సభ్యదేశాలు ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ప్రతి ఏటా ఏప్రిల్ 18న 'ప్రపంచ వారసత్వ దినోత్సవం (వరల్డ్ హెరిటేజ్ డే ) గా పాటిస్తున్నారు. మన సాంస్కృతిక వైవిధ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఈ రోజు గుర్తుచేస్తుంది. ఆఫ్రికా ట్యునీషియాలో 1982 ఏప్రిల్ 18న అంతర్జాతీయ వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై 'ఐక్యరాజ్యసమితి', 'అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం' సంయుక్త ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులిచ్చిన సలహాలు, సూచనలతో యునెస్కోకి ప్రతిపాదనలు పంపించగా 1983లో ఆమోదం పొందింది. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్‌ 18వ తేదీనే 'ప్రపంచ వారసత్వ దినోత్సవం' గా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి వారసత్వ సంపదపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతుండగా.. దాదాపు ఎనిమిది వందలకు పైగా పురాతన కట్టడాలు, స్థలాలను పరిరక్షిస్తుండటం విశేషం. భారతదేశం అపారమైన చారిత్రక వైభవాన్ని, ఘనమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగింది. ఈ దేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు, అపురూపమైన కళాఖండాలకు నిలయంగా ఉంది. ఇది నిజంగా మానవసృష్టేనా అనిపించేలా.. ఊహకందని రీతిలో పురాతనకాలంలోనే నిర్మించిన ఎన్నో ఆశ్చర్యకరమైన స్మారక చిహ్నాలు నేటికి జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ మనకు వారసత్వంగా లభించిన సంపదలు. వీటిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పలు పురాతన కట్టాడాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రామప్ప దేవాలయానికి మాత్రమే యునెస్కో గుర్తింపు లభించింది. వరంగల్ నగరానికి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరిలో రుద్రేశ్వర దేవాలయం ఉంది. దీనినే రామప్ప దేవాలయం అని కూడా పిలుస్తారు. కాకతీయ రాజవంశ పాలకుడైన గణపతిదేవుని కాలంలో 1213 సంవత్సరంలో రేచర్ల రుద్రారెడ్డి ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఎలాంటి పునాదులు లేకుండానే పూర్తిగా ఇసుకరాయిని ఉపయోగించి చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనం. కాలానికి అతీతంగా ఈ ఆలయం నేటికి చెక్కుచెదరకుండా సజీవకళతో ఉండటం నిజంగా ఓ ఆశ్చర్యం.ఇటువంటి కట్టడాలను రక్షించుకోవాలి. యం. రాం ప్రదీప్ తిరువూరు 9492712836